Monday, August 28

మీజిల్స్‌, రుబెల్లా నివారణ ఎలా?

తట్టు(మీజిల్స్‌)ను చిన్నమ్మవారు అని కూడా అంటారు. ఇది అంటు వ్యాధి. వైరస్‌ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని పర్యవసానంగా ఆరోగ్యపరంగా సంక్లిష్ట సమస్యలు ఎదురవు తుంటాయి. న్యూమోనియా, ఎన్‌సెఫలిటీస్‌( మెదడు వాపు) వంటివి సంక్రమిస్తాయి. దీంతో ఒక్కోసారి మరణం సంభవించొచ్చు.
పొంగు (రుబెల్లా) అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. పిల్లలు వాక్సిన్‌ తీసుకోని కారణంగా ఇది సంక్రమిస్తుంది. యువత, వృద్ధుల్లోనూ పొంగు వచ్చే అవకాశాలున్నాయి. వాక్సిన్‌ తీసుకోని మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఇదొస్తే తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల వరకు పొంగు వస్తే గర్భస్త్రావం అవుతుంది. గర్భంలోనే శిశువు చనిపోవచ్చు. శిశువుకు పుట్టుకతోనే పొంగు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఏమిటీ వ్యత్యాసం?
తట్టు, పొంగుకు సంబంధించిన వైరస్‌లు వివిధ వైరస్‌ కుటుం బాలకు చెందినవి. కానీ ఈ రెండు రకాల పోలికలూ మాత్రం దగ్గరగా ఉంటాయి.

  1. మనుషులకు మాత్రమే ఈ వ్యాధులు సంక్రమిస్తాయి.
  2. ఒకరి నుంచి మరొకరికి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తాయి.
  3. ఇన్‌ఫెక్షన్‌ తర్వాత జ్వరం వస్తుంది. చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి.
పుట్టుకతో 'పొంగు' అంటే?
పుట్టుకతో పొంగు వ్యాధి రావడానికి ప్రధాన కారణం 90 శాతం వరకు తల్లి అవుతుంది. గర్భం దాల్చిన మహిళకు మొదటి పది వారాలలోపు పొంగు వస్తే బిడ్డకు పుట్టుకతో ఆ వ్యాధి సంక్రమిస్తుంది. తల్లికి పొంగు వ్యాధి రావడం వల్ల గర్భస్త్రావం అవుతుంది. లేదా శిశువుకు పుట్టుకతో లోపాలు తలెత్తొచ్చు. గుండె సంబంధిత వ్యాధులతోపాటు చెవిటి మూగ, మెదడు దెబ్బతినడం, కంటి సమస్యలు రావచ్చు. కాటరాక్ట్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వ్యాప్తి ఇలా...
తట్టు సర్వసాధారణంగా శ్వాస ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మీజిల్స్‌ వైరస్‌ వల్ల తట్టు వస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా గాలి ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ సంక్రమిస్తుంది. నాలుగురోజుల్లోనే చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి. పొంగు మాత్రం ముక్కు, నోరు నుంచి కారుతున్న స్రావాల ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. వాక్సిన్‌ వేసుకోని వారికి పొంగు దాడి చేసే ప్రమాదం ఉంది.
ముప్పు ఎవరికి?
ఎవరికైనా ఈ వైరస్‌ ముప్పు పొంచి ఉంటుంది. వాక్సిన్‌ తీసుకోని వారితో పాటు గతంలో పొంగు ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి పొంగు వచ్చే ప్రమాదముంది. తొమ్మిది నెలలలోగా తట్టు నివారణకు రెండు డోసులు వాక్సిన్‌ వేసుకోని వారికి మీసల్స్‌ వైరస్‌ సంక్రమిస్తుంది. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి తట్టు, పొంగు వ్యాధులు వ్యాపిస్తుంటాయి. క్యాన్సర్‌ రోగులు తీసుకునే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ డోస్‌ ఉన్న ఉత్ప్రేరక మందులు వాడటం వల్ల ఈ రెండు రకాల వ్యాధులు వస్తాయి.
నివారణ ఎలా?

  1. తట్టు, పొంగు నివారణకు రెండు డోసుల ఎంఎంఆర్‌(మీజిల్స్‌, మమ్ప్స్‌, రుబెల్లా) వాక్సిన్‌ తీసుకోవాలి. ఇది ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడుతుంది.
  2. ఈ వాక్సిన్‌ పిల్లలకు తొమ్మిది నెలలలోపే ఇవ్వాలి.
  3. రెండో డోసు ఎంఎంఆర్‌వీ(మీజిల్స్‌, మమ్ప్స్‌, రుబెల్లా, వెరిసెల్లా) వాక్సిన్‌ 15 నెలల వయసులో ఉన్న శిశువుకు ఇవ్వాలి. మూడో డోసు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇవ్వాలి.
  4. రెండు పర్యాయాలకన్నా ఎక్కువగానే ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం సురక్షితం.
  5. తట్టు వైరస్‌ సంక్రమించినవారు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సంక్రమించదు. కనీసం నాలుగురోజుల పాటు దద్దుర్లు ఉంటాయి. తట్టు లేనివారికి దూరంగా ఉండాలి.
  6. పొంగు వ్యాధి సంమ్రించిన గర్భిణికి వాక్సిన్‌ ఇవ్వకపోవడమే ఉత్తమం
నిర్ధారణ ఇలా...
పొంగు వ్యాధిని నిర్ధారించడం చాలా కష్టం. ఇతర వైరస్‌ల వల్ల అనారోగ్యం వాటిల్లినట్టుగానే ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. జ్వరం, దద్దుర్లు వస్తుంటాయి. రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారణ చేసుకోవాలి.
తట్టును త్వరగా గుర్తించొచ్చు. దీని బారినపడిన వ్యక్తులకు అసౌ కర్యంగా ఉంటుంది. తరచూ దగ్గుతుంటారు. ముక్కు నుంచి స్రావాలు కారడం, జ్వరం, దద్దుర్లు వాటిల్లి తట్టు లక్షణాలుగా అనుమానించొచ్చు. తట్టు వ్యాధి లక్షణాలు కనిపించగానే రక్త పరీక్ష చేయించాలి. వ్యాధిని సులభంగా గుర్తించడానికి ముక్కు, గొంతు, మూత్రం నుంచి శాంపిల్స్‌ సేకరిస్తారు.
చికిత్స
తట్టు, పొంగు వ్యాధులను అరికట్టడానికి విశ్రాంతి చాలా అవసరం. పారాసెటమల్‌ మాత్రలు వేసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది. ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. తట్టు, పొంగు వ్యాధి వచ్చినవారికి ఇంట్లోనే ఉండే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే ఒకరి నుంచి మరొకరికి ఇవి వ్యాపిస్తాయి. వీటి లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవాలి.

Sunday, August 27

ఎసిడిటీకి విరుగుడు...

ఎసిడిటీ ఏర్పడటానికి అనేక కారణాలుంటాయి. అధికంగా మసాలా తిండి, అతి ఆహారం వంటివి కొంత మేర ఎసిడిటీ తెస్తాయి. ఎసిడిటీ విరుగుడుగా ఎన్నోరకాల మందులు ఉన్నాయి. అయినా సహజ మార్గాలను ఎంచుకోవడమే మేలు.
  1. ఎసిడిటీ ఉంటే ఆహారంలో అరటిపండు తినండి. అది మంటను తగ్గించడంలో సహాయపడతుంది.
  2. మసాలాలు, వేపుడు కూరలు, ఊరగాయలు, చాక్లెట్లు వంటివాటికి దూరంగా ఉండండి.
  3. పచ్చి క్యాబేజి, పచ్చి ఉల్లి, రాడిష్‌, మిరియాలు వంటివి తినొద్దు. వాటి వల్ల ఎసిడిటీ మరింత పెరుగుతుంది.
  4. పండని పండ్లు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. పూర్తిగా పండిన యాపిల్‌ అసలే వద్దు.
  5. ఆహారాన్ని బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి తప్ప బలవంతంగా తినొద్దు.
  6. హడావుడిగా ఆహారం తినే పద్ధతి మార్చుకోవాలి.
  7. భోజనానికీ భోజనానికీ మధ్య సమయం మరీ అధికంగా లేకుండా చూసుకోవడం మంచిది.
  8. నీటిని అధికంగా తీసుకోవడం చాలా మంచిది.
  9. రాత్రిపూట ఆహారం తీసుకునే సమయానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
  10. సిగరెట్‌, మత్తు పానీయాల అలవాటు బాగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.

మధ్యాహ్నం నిద్ర ఇబ్బంది పెడితే...

మధ్యాహ్నం లంచ్‌ తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. భోజనం చేసినప్పుడు శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయితేనే కదా బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉండేది. ఈ క్రమంలో శరీరంలో ఇన్సులిన్‌ ఎక్కువైనప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. ఫలితంగా సెరటోనిన్‌, మెలటోనిన్‌ అనే రెండు హార్మోన్లను మెదడు ఉత్పత్తి చేస్తుంది. నిజానికి మెలటోనిన్‌ అనేది నిద్ర హార్మోన్‌. అది నిద్రను ప్రేరేపిస్తుంది. అయితే నిద్ర హార్మోన్ల వల్లే కాదు, మధ్యాహ్నం ఎక్కువగా తినడం వల్ల ఆ తిండిని జీర్ణ చేసేందుకు శరీరం 60 నుంచి 75 శాతం వరకు శక్తిని ఖర్చు పెడుతుందట. దీంతో మనకు పని చేయడానికి కావల్సినంత శక్తి లభించదు. ఫలితంగా శరీరం రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అప్పుడు నిద్ర తన్నుకు వస్తుంది. అదే లంచ్‌ తక్కువగా తీసుకుంటే నిద్ర రాదు. దీంతో యాక్టివ్‌గా ఉండవచ్చు. ఇదే సూత్రం రాత్రి పూట చేసే డిన్నర్‌కు కూడా వర్తిస్తుంది. అప్పుడు మనకు ఎటూ ఎక్కువ శక్తి అవసరం ఉండదు, కనుక తక్కువ తిన్నా చాలు. దాంతో అదనపు కొవ్వు చేరదు. అదేవిధంగా నిద్ర హార్మోన్ల ద్వారా కాకుండా సహజంగా వచ్చే నిద్రతోనే నిద్రలోకి జారుకోవచ్చు. అది మరుసటి రోజున మనల్ని యాక్టివ్‌ గా ఉంచుతుంది. అయితే మధ్యాహ్నం తక్కువగా తింటే మళ్లీ ఆకలి వేస్తే ఎలా..? అలా ఆకలి వేసినప్పుడు పండ్లు, నట్స్‌ వంటివి తినాలి. అవి కూడా లైట్‌గా తీసుకోవాలి. దీంతో నిద్ర రాదు, యాక్టివ్‌గా ఉంటారు.

న్యూమోనియా వస్తే అవస్థే...

ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్‌ఫెక్షనే న్యూమోనియా. ఇది ఒక అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాపిస్తుంది. న్యూమోకోకస్‌, హెచ్‌ ఇన్‌ఫ్లూయెంజా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. వాతావరణంలో ఉండే రకరకాల సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి శ్వాసకోశాల్లో ఇబ్బందులు కలుగజేస్తాయి. శ్వాసనాళాల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కొన్ని రకాల ద్రవాలతో శ్వాసకోశాలు నిండిపోతాయి. ఈ ద్రవాల కారణంగా శ్వాసకోశాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించ లేవు. దీంతో శరీరానికి అందాల్సిన ఆక్సీజన్‌ సరిగ్గా అందదు. దీంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో నీరు లేక కళ్లె చేరడంతోపాటు శ్వాసగ్రంధులు మూసుకుపోతాయి. ఫలితంగా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీని వల్ల శ్వాస కండరాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఎటైపికల్‌ ఆర్గానిజమ్స్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. సరైన పోషకాహారం అందకపోవడం వల్ల పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి అంతగా ఉండదు. దీంతో న్యూమోనియా వైరస్‌ వారిలోకి వేగంగా ప్రవేశిస్తుంది. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులు, లివర్‌ సిర్రోసిస్‌ ఉన్నవారిలో న్యూమోనియా త్వరగా వస్తుంది.
న్యూమోనియా బారిన పడ్డవారిలో ఆయాసం ఎక్కువగా కనిపిస్తుంది. చల్లగాలి తగిలినా, చల్లని పదార్థాలు తీసుకున్నా సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంలో ప్రబలుతుంది. కొంతమందికి ఆస్తమా తీవ్రరూపం దాల్చి న్యూమోని యాగా మారుతుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఎక్కువగా పిల్లలు, వృద్ధులు దీని బారిన పడతారు.
రకాలు :-
న్యూమోనియాలో కమ్యూనిటీ ఎక్వైర్డ్‌ న్యూమోనియా, హాస్పిటల్‌ ఎక్వైర్డ్‌ న్యూమోనియా, హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్‌, వెంటిలేటర్‌ అసోసియేటెడ్‌ అనే రకాలు ఉన్నాయి. సాధారణంగా వచ్చేది కమ్యూనిటీ ఎక్వైర్డ్‌ న్యూమోనియా. హాస్పిటల్‌లో ఉండగా న్యూమోనియా వస్తే దాన్ని హాస్పిటల్‌ ఎక్వైర్డ్‌ అని, దీర్ఘకాలిక వ్యాధులు ఉండి లేదా మరే ఇతర కారణాల వల్ల లేదా ఇంటి దగ్గర లేదా హాస్పిటల్‌లో లేదా నర్సింగ్‌కేర్‌ ఉన్నా న్యూమోనియా వస్తే దాన్ని హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్‌ న్యూమోనియా అని అంటారు. ఇవన్నీ సీరియస్‌ న్యూమోనియాలే. వీటిలో డ్రగ్‌ రెసస్టెన్స్‌ కూడా ఎక్కువగా ఉండొచ్చు.
లక్షణాలు :-
  1. ఆకలి బాగా తగ్గిపోతుంది.
  2. చలితో కూడిన జ్వరం వస్తుంది.
  3. బాగా నీరసంగా ఉంటారు.
  4. దగ్గు విపరీతంగా ఉంటుంది. దగ్గులో కళ్లే , ఒక్కోసారి రక్తం పడుతుంది.
  5. ఆయాసం, ఛాతీలో నొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
  6. కొందరిలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు లేదా చీము చేరుతుంది.
  7. శ్వాసకోశాల్లో ద్రవాలు ఎక్కువగా చేరడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.
నిర్ధారణ-చికిత్స :-
రక్తపరీక్షలు, కళ్లె పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే తీసి న్యూమోనియా నిర్ధారిస్తారు. న్యూమో నియా అని నిర్ధారణ అయిన తర్వాత ఎంత తొందరగా యాంటీ బయోటిక్‌ మందులు వాడటం ప్రారంభిస్తే అంత త్వరగా కొలు కునే అవకాశం ఉం టుంది. మందులు అన్ని రకాల సూక్ష్మక్రిములను చంపే విధంగా ఉండాలి. చుట్టుపక్కల ప్రాంతాలలో క్రిములకి డ్రగ్‌ రెసిస్టెన్స్‌ ఎంత ఉందనే విషయం కూడా పరిగణనలోని తీసుకోవాలి. సరైన మోతాదులో మందులు వాడకపోతే.. జబ్బు ముదిరే ప్రమాదం ఉంది.
పిల్లలు జర జాగ్రత్త :-
  1. జనం గుంపులుగా ఉండే చోట్లకు పిల్లలను తీసుకెళ్లొద్దు.
  2. చల్ల గాలి తగలకుండా చూసుకోవాలి.
  3. ఉప్పు నీళ్లను తాగించాలి.
  4.  చల్లగా ఉండే ఆహార పదార్థాలను పెట్టకూడదు.
  5. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు పిల్లలకు దూరంగా ఉండాలి.
  6. జ్యూస్‌ల వంటి చల్లని ద్రవాలను తాగించకూడదు.
  7. పొగ తాగే వాళ్లకు దూరంగా ఉంచాలి.
  8. ఆరేళ్ల వరకు పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం.
  9. ఇంటి పరి సరాలు శుభ్రంగా ఉండేలా చూసుకో వాలి.
  10. పిల్లలను ఎత్తుకునే ముందు, వారికి ఆహారం తినిపించేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.