Sunday, August 27

మధ్యాహ్నం నిద్ర ఇబ్బంది పెడితే...

మధ్యాహ్నం లంచ్‌ తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. భోజనం చేసినప్పుడు శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయితేనే కదా బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉండేది. ఈ క్రమంలో శరీరంలో ఇన్సులిన్‌ ఎక్కువైనప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. ఫలితంగా సెరటోనిన్‌, మెలటోనిన్‌ అనే రెండు హార్మోన్లను మెదడు ఉత్పత్తి చేస్తుంది. నిజానికి మెలటోనిన్‌ అనేది నిద్ర హార్మోన్‌. అది నిద్రను ప్రేరేపిస్తుంది. అయితే నిద్ర హార్మోన్ల వల్లే కాదు, మధ్యాహ్నం ఎక్కువగా తినడం వల్ల ఆ తిండిని జీర్ణ చేసేందుకు శరీరం 60 నుంచి 75 శాతం వరకు శక్తిని ఖర్చు పెడుతుందట. దీంతో మనకు పని చేయడానికి కావల్సినంత శక్తి లభించదు. ఫలితంగా శరీరం రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అప్పుడు నిద్ర తన్నుకు వస్తుంది. అదే లంచ్‌ తక్కువగా తీసుకుంటే నిద్ర రాదు. దీంతో యాక్టివ్‌గా ఉండవచ్చు. ఇదే సూత్రం రాత్రి పూట చేసే డిన్నర్‌కు కూడా వర్తిస్తుంది. అప్పుడు మనకు ఎటూ ఎక్కువ శక్తి అవసరం ఉండదు, కనుక తక్కువ తిన్నా చాలు. దాంతో అదనపు కొవ్వు చేరదు. అదేవిధంగా నిద్ర హార్మోన్ల ద్వారా కాకుండా సహజంగా వచ్చే నిద్రతోనే నిద్రలోకి జారుకోవచ్చు. అది మరుసటి రోజున మనల్ని యాక్టివ్‌ గా ఉంచుతుంది. అయితే మధ్యాహ్నం తక్కువగా తింటే మళ్లీ ఆకలి వేస్తే ఎలా..? అలా ఆకలి వేసినప్పుడు పండ్లు, నట్స్‌ వంటివి తినాలి. అవి కూడా లైట్‌గా తీసుకోవాలి. దీంతో నిద్ర రాదు, యాక్టివ్‌గా ఉంటారు.

No comments:

Post a Comment