Thursday, November 30

నొప్పి నివారణ ఇలా...

ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. ప్రతిఒక్కరూ ఏదోక శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిలో నడుము , వెన్ను, కాళ్ల నొప్పులు ముఖ్యమైనవి. దైనందిన జీవితంలో ఇవొక రుగ్మతగా మారింది. దీన్ని నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం...
  1. అధిక బరువు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. నడుము, కాళ్ల నొప్పులు రావడానికి కూడా ఇదే ముఖ్య కారణం. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు వల్ల నడుము, కాళ్లపై అధిక బరువు పడుతుంది. దీంతో నొప్పి వస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు.
  2. గంటల కొద్దీ కూర్చొని పనిచేసే వారు శారీరక నొప్పులతో బాధపడు తుంటారు. ముఖ్యంగా వెన్ను నొప్పి వీరిని సతాయిస్తుంది. ఇలాంటి వారికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వెన్నుకు ఆసరాగా ఉండే కుర్చీల్లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మోకాళ్లు తుంటికి కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోకుండా అరగంటకోసారైనా నా రెండు నిమిషాల పాటు లేచి నిలబడాలి. అటూ ఇటూ నాలుగు అడుగులు వేయాలి.
  3. కొంతమంది డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడాల్సిన వస్తుంది. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు తలను నిటారుగా పెట్టి, పొట్టను లోపలికి లాక్కుని నిలబడేందుకు ప్రయత్నించాలి. కూరున్నప్పుడు గానీ, నిలబడినప్పుడు గానీ అసౌకర్యంగా అనిపించినా కండరాలు బిగుసుకు పోయినట్టు అనిపిస్తే భంగిమను మార్చుకోవాలి.
  4. బరువులు ఎత్తే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నడుము నొప్పి, మెడనొప్పి వస్తుంది.
  5. బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు నడుమును ముందుకు వంచకూడదు. ఎత్తాల్సిన వస్తువును శరీరానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మోకాళ్లను వంచి, పొట్ట కండరాలను లోపలికి లాక్కుంటూ పైకి లేపాలి.బరువు చేతిలో ఉన్నప్పుడు శరీరాన్ని పక్కలకు తిప్పకూడదు. వస్తువులను లాగడం కన్నా తోయడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
  6. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నడుము, మెడ నొప్పులు వేధిస్తుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో శరీర పటుత్వం పెరుగుతుంది. కండరాలు బిగుసుకుపోవడం, వాపులు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

Monday, November 27

ఇంగువ... ప్రయోజనాలు ఎక్కువ

మన వంటకాల్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. సుగంధ ద్రవ్యాలు కలిపి వండిన వంటలతో పోలిస్తే ఇంగువ కలిపి వండిన వంట రుచికరంగా ఉంటుంది. వాసనలోనూ తేడా ఉంటుంది. దీనిని పప్పు, చారు, సాంబార్‌, పులిహౌర, శాకాహార వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాలింపు, పచ్చళ్లలో కూడా దీనిని వాడతారు. ఒకప్పుడు ఇంగువ లేని వంటకమే ఉండేది కాదు. ఇప్పుడు దీనిని చాలా మంది విస్మరిస్తున్నారు. అయితే.. ఇంగువ వంటకాల్లో మాత్రమే వాడుకునే పదార్థమనే విషయం అందరికీ తెలుసు. ఇందులో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అదెలాగో తెలుసుకుందాం...  
  1. పుచ్చుపళ్లతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయమ వుతాయి.
  2. శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకుని అందులోనే ఉంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రావకం పోయాలి. కాసేపటి తర్వాత అది దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
  3. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, ఇతర చర్మ వ్యాధులతో బాధ పడుతున్నవారు కాసింత నీటిలో ఇంగువను కలిపి ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
  4. ఊపిరితిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధం.
  5. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఇంగువ చూర్ణం తీసుకోవాలి.
  6. కడుపులో పురుగులు ఉంటే ఇంగువను నీళ్లలో కలిపి తీసుకోవాలి.
  7. రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
  8. ఇంగువ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
  9. నరాలను ఉత్తేజపరుస్తుంది.

Sunday, November 26

సిజేరియన్‌ డెలివరీ.. జాగ్రత్తలు..!

బిడ్డను కనడానికి సిజేరియన్‌ని ఎవరూ ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి అవుతుంది. తల్లీబిడ్డల ప్రాణాలను దక్కించుకోవడానికి ఇదోక మార్గం. అయితే... నార్మల్‌ డెలివరీకంటే సిజేరియన్‌ తర్వాత తల్లి శరీరంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. త్వరగా కోలుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
  1.  సిజేరియన్‌లో శరీరంలోని ఫూ ్లయిడ్స్‌ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సిజేరియన్‌ చేయించుకున్న వాళ్లు త్వరగా కోలుకోవాలంటే మెల్లగా కదలడం (ఇతరుల సహాయంతో) మొదలు పెట్టాలి.
  2.  డాక్టర్‌ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. దీని వల్ల త్వరగా కోలుకోవచ్చు.
  3.  సర్జరీ జరిగిన శరీర భాగంలో తడి తగలకుండా జాగ్రత్త పడాలి.
  4.  సర్జరీ తర్వాత చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. లేదా వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్‌ డైట్‌ని కొన్ని రోజులు ఫాలో కావాలి.
  5.  మూత్ర విసర్జనకు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.
  6.  సిజేరియన్‌ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ బరువు ఎత్తకూడదు. కొన్ని వారాలపాటు ఇది పాటించాలి. లేదంటే.. సర్జరీ అయిన శరీర భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.
  7.  నిద్రించే సమయంలో కుట్లు వేసి భాగంపై ఒత్తిడి పడొద్దు. ఇందుకు మరోవైపు తిరిగి పడుకోవాలి.
  8.  సర్జరీ తర్వాత బిగుతుగా ఉండే జీన్స్‌, లెగ్గింగ్స్‌ వేసుకోకూడదు. ఇవి పొట్టపై ఒత్తిడి పెంచుతాయి. అంతేకాదు.. ఇది చాలా ప్రమాదకరం.
  9.  సర్జరీ తర్వాత 40 రోజుల వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం మంచిది.

Friday, November 24

ఆరోగ్య ప్రదాయిని మునగ...

ఇది చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క. దీని ఆకులు, కాయలను కూరగా వాడతారు. వీటిలో రుచితో పాటు ఔషధ గుణాలు ఎక్కువ. మునగలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీని ఆకుల ఎదిగే పిల్లలకు టానిక్‌లా ఉపయోగ పడుతుంది...
  1. పాలలో మునగ రసం కలిపి తాగితే ఎముకలు ధృడమవుతాయి. గర్భిణులు దీన్ని తాగడం వల్ల కాల్షియం, ఐరన్‌, విటమిన్స్‌ లభిస్తాయి. సుఖ ప్రసవానికి ఇది తోడ్పడుతుంది.
  2. కాస్తంత నీటిలో మునిగాకులు వేసి ఉడికించాలి. ఉప్పు జోడించి తీసుకుంటే ఆస్తమా, క్షయ సమస్యలకు మంచి మందుగా పని చేస్తుంది .
  3. మునగలో యాంటీ బాక్టీరియా గుణాలు ఉంటాయి. దీని సూప్‌ దగ్గు, చర్మ సమస్యలను నివారిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  4. కలరా, కామెర్లు వచ్చినప్పుడు కొంచెం తేనెతో మునగాకుల రసాన్ని కలిపి కొబ్బరి నీరుతో రోజూ రెండుసార్లు తాగాలి.
  5. మధుమేహులు ఒక టీ స్పూన్‌ మునగ రసంలో 10 గ్రాముల లావు ఉప్పు కలిపి రోజుకోసారి తాగడం వల్ల అతి మూత్ర సమస్య తగ్గుతుంది.
  6. మునగాకు రసం, తేనె, కొబ్బరి నీరు కలిపి చిన్న కప్పు చొప్పున రోజూ రెండు, మూడుసార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.
  7. కామెర్లు ఉన్నవారు చెంచా మునగాకు రసాన్ని రెండు చెంచాల కొబ్బరి నీటిలో కలిపి వారం రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
  8.  మునగాకు రసంలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి పరగడుపున తీసుకుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
  9. మూత్రంలో మంట , ఉష్ణతత్వం ఉన్నవారు మునగాకు, క్యారెట్‌, దోసకాయల రసాలను జత చేసి రోజుకు గ్లాసు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  10. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు ఎండబెట్టిన మునగాకు పొడిని తేనెతో కలిపి రోజుకో చెంచా చొప్పున భోజనానికి ముందు తీసుకోవాలి.

Wednesday, November 15

బరువు తగ్గించే క్యాలరీలు...

శరీర బరువు అదుపులో ఉండాలంటే ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించుకుంటూ వ్యాయామం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా అవసరం. అవి ఆరోగ్యానికే కాదు శరీర బరువును అదుపులో ఉంచుతాయి...
  1. క్యాప్సికం:- క్యాప్సికంలో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే రుచిగా, కారంగా ఉంటాయి. 100 గ్రా|| క్యాప్సికం శరీరానికి అవసరమైన 20 శాతం క్యాలరీలను అందిస్తాయి.
  2. ఆపిల్‌:- ఆపిల్‌ పండు ముక్కలను రోజు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 100 గ్రా||ఆపిల్‌ పండ్లు, 50 శాతం క్యాలరీలను అందిస్తుంది.
  3. పాలకూర:- పాలకూరలో పోషకాలు, విటమిన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించటానికి ఉపయోగపడతాయి. 100 గ్రా|| పాలకూర, 23 శాతం క్యాలరీలను అందిస్తుంది.
  4. క్యాబేజీ:- క్యాబేజీలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. 100 గ్రా|| క్యాబేజీ, 25 శాతం క్యాలరీలను అందిస్తుంది.
  5. బ్లూ బెర్రీ:- బ్లూ బెర్రీలో ఎక్కువ శాతం న్యూట్రీన్లు ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇవి అధిక రక్తపోటు ఉన్న వారు తింటే సరిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. 100 గ్రా|| బ్లూ బెర్రీ, 57 శాతం క్యాలరీలను అందిస్తాయి.
  6. క్యారెట్స్‌:- క్యారెట్‌లో బీ-కెరోటిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌ను రోజు జ్యూసు చేసుకొని తాగితే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ ముఖ్యంగా శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తాయి. 100 గ్రా|| క్యారెట్స్‌, 40 శాతం క్యాలరీలను అందిస్తాయి.
  7. డార్క్‌ చాక్లెట్‌:- డార్క్‌ చాక్లెట్‌ న్యూట్రినల్‌ గుణాలను కల్గి ఉంటుంది. దాంట్లో ఉండే ఫ్లేవినాయిడ్స్‌, పాలీఫినొల్స్‌, నూట్రీన్లు ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుతాయి. డార్క్‌ చాక్లెట్‌ ముఖ్యంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 100 గ్రా|| డార్క్‌ చాక్లెట్‌, 500 క్యాలరీలను అందిస్తుంది.

Friday, November 10

నిత్య వ్యాయామం తప్పనిసరి...

కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చోవడం.. కాసేపు విరామం దొరికినా స్మార్ట్‌ ఫోన్లను చూస్తూ కాలం గడపడం.. సమయం ఉన్నా కూడా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే చోట ఫేస్‌ బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలకుండా ఉండిపోవడం ద్వారా ఊబకాయం తప్పుదు. ప్రస్తుతం ప్రపంచ జనాలంతా ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్నారు. ఈ ఫాస్ట్‌ లైఫ్‌లో వ్యాయామం చేయడానికి తీరిక ఉండట్లేదు. ఒక వేళ ఉన్నా వ్యాయామం, శారీరక శ్రమతో కూడిన పనుల్ని చేసేందుకు చాలామంది ఇష్టపడట్లేదు.
ఆఫీసుకు వెళ్ళామా ఇంటికొచ్చామా.. ఏదో సినిమా చూశామా.. ఇంకా టైముంటే స్మార్ట్‌ ఫోన్లు చూస్తూ కూర్చుండిపోయామా అని చాలామంది కాలం గడుపుతున్నారు. అయితే వ్యాయామం లేకపోతే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ లేని కారణంగా ఊబకాయం బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.3 మిలియన్ల మంది చనిపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
శారీరక శ్రమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిలో ఒబెసిటీతో పాటు మతిమరుపు పూర్తిగా తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకుంటే మతిమరుపు దూరం కావడంతో పాటు చురుకుదనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయని వారు సెలవిస్తున్నారు.

Thursday, November 9

విరామ సమయంలో...

ఎక్కువ ఒత్తిడికి గురైతే సహజంగానే శరీరం బరువు తగ్గుతుంది, నీరసంగా అనిపిస్తుంది. అదే విధంగా తదేకంగా కొన్ని గంటల పాటు కదలకుండా పని చేస్తే సహజంగానే ఎదో తెలియని బాధకు గురి కావటం, శరీరం అలసిపోవటం, కండ్లు మంట పుట్టటం, తల నొప్పి రావటం జరుగుతుంది. అలాంటి సమయంలో ఒక ఐదు నిమిషాలు పనిలో విరామం తీసుకుంటే మెదడు ప్రశాంతంగా ఉండటంతో పాటు తాజాదనంతో నిండిపోతుంది. పనిలో ఒత్తిడి తగ్గటానికి విరామ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు...
  1. అలసటను దూరం చేయటంలో అద్భుతమైన ఔషధం సంగీతం. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఇష్టమైన సంగీతం వినటం మంచిది. ఇలా చేయటం వల్ల మెదడులోని అలసట భావన దూరం అవుతుంది.
  2. ఒత్తిడిని తగ్గిం చటంలో గ్రీన్‌ టీ పాత్ర కీలకం. ఎందుకంటే గ్రీన్‌ టీ ఆకుల్లో ఎమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయట. ఇవి ముఖ్యంగా ఆందోళనను తగ్గించి ప్రశాంతంతను కల్గిస్తాయి. అలాగే శరీరంలోకి డొపమైన్‌, సెరొటొనిన్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి ఆనందాన్ని కలిగించటంతో పాటు డిటాఫ్సికేషన్‌కు తోడ్పడుతాయి.
  3. అలాగే పనిలో ఆందోళనను తగ్గించటంలో నిద్ర పాత్ర కీలకం. నిద్ర సరిగ్గా పోవటం వల్ల చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే పని చేసే సమయంలో బాగా నిద్ర వస్తే ఒక 15 నిమిషాలు నిద్ర పోతే చాలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.
  4. గంటల తరబడి కదలకుండా కూర్చోవటం వల్ల శరీర కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి. నడుము నొప్పి, తల నొప్పి వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే పని చేసే సమయంలో పది నిమిషాలకోసారి అటుఇటూ తిరగటం లేదా శరీరాన్ని కదిలించటం వంటివి చేస్తుండాలి. అలాగే ప్రతి రోజు కండరాలను సంబంధించిన వ్యాయామం తప్పని సరి.

Wednesday, November 8

నీళ్లతో వైద్యం...

తాగేనీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను నివారించొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దాం...
  1. నీరు వేడి చేసి అందులో కాసింత ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్‌ తగ్గుతాయి.
  2. నీటిని మరిగించి కొద్దిగా పసుపు లేదా రెండు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి ఆవిరి పడితే జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.
  3. ఐస్‌ ముక్కల్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
  4. గ్లాసుడు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా సిప్‌ చేస్తూ తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  5. కరిస్తే సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కలిగించే సూక్ష్మజీవులు తొలగిపోతాయి.
  6. చర్మం కాలితే వెంటనే చల్లటి నీటితో గాయాన్ని తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింత పెరగకుండా ఉంటుంది.
  7. వేడినీరు తాగితే కఫం కరుగుతుంది. పసుపును మరిగేనీటిలో వేసి ఆవిరి పడితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  8. చిన్న చిన్న గాయాలను చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకడుతుంది. రక్తం కారడం తగ్గుతుంది.
  9. వేడి నీళ్లలో ఉప్పు వేసి కాపడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
  10. రాత్రి రాగి చెంబులో నీరు పోసి పరగడుపున తాగితే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
  11. ముక్కులోంచి రక్తం పడుతుంటే చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వేయాలి.
  12. గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.
  13. ఎక్కువనీరు తాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. మూత్రం ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.
  14. నీరు ఎక్కువగా తాగితే సూక్ష్మజీవులు వేగంగా మూత్రం ద్వారా బయటకు పోయి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

Monday, November 6

స్నాక్స్‌లో పండ్ల ముక్కలు...

కొన్ని సార్లు ఆహారం విషయంలో ఎన్నీ జాగ్రత్తలు పాటించినా అనారోగ్యం వెంటాడుతుంది. అలాంటి సమయంలో పౌష్టికాహారం తీసుకున్నా ఫలితం కనిపించదు. ఎందుకంటే ఆ వ్యాధిని దూరం చేసే యాంటీ ఆక్సిడెంట్‌ ఆహార పదార్థాలను తీసుకుంటేనే కొంచెం ఫలితం కనిపిస్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది విటమిన్‌ 'కె'. ఇది గుండె సంబంధిత వ్యాధులను, రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలున్న విటమిన్‌ 'కె' లభించే ఆహార పదార్థాలేంటో ఓ సారి చూద్దాం...
  1. ఆకుకూరల్లో పుష్కలంగా విటమిన్‌ 'కె' లభిస్తుంది. అత్యధికంగా విటమిన్‌ 'కె' పాలకూరలో ఉంటుంది. పాలకూరను వారానికి మూడు సార్లు తిన్న శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇలా చేయడటం వల్ల శరీరానికి అవసరమైన 445 మై|గ్రామ్స్‌ల న్యూట్రీన్లు సమృద్ధిగా అందుతాయి.
  2. నల్లద్రాక్షల్లో కూడా విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లు తినటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  3. అలాగే కూరలో రుచి కోసం ఉపయోగించే కొత్తిమీర, కరివేపాకులో కూడా విటమిన్‌ 'కె' ఉంటుంది. ఈ ఆకుకూరలు ఎండిపోయినా కూడా విటమిన్లను కోల్పోకుండా ఉంటాయి.
  4. కూరగాయలలో ముఖ్యంగా బెండకాయలో విటమిన్‌'కె' ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు రోజులకు ఓ సారి తిన్నా ఆరోగ్యంగా ఉంటారు.
  5. గుడ్డులో కూడా విటమిన్‌ 'కె' పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉడికించిన గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డులో ముఖ్యంగా ఐరన్‌, ప్రోటీన్లు, ఫోలిక్‌ ఆమ్లం ఉంటాయి.
  6. వేసవి కాలంలో ఎక్కువగా చిరుతిళ్ళు తినడానికే ఇష్టపడతారు. స్నాక్స్‌గా దోసకాయ ముక్కలను, క్యారెట్‌ ముక్కలను తినటం మంచిది. ఇవి శరీరాన్ని డిహైడ్రేట్‌ కాకుండా కాపాడుతాయి. అలాగే అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Thursday, November 2

ప్రతి నొప్పి గుండెపోటు కాదు...

గుండె దడ అనేది చాలా మందిలో ఉండే రుగ్మత. ఛాతీ నొప్పిని కూడా చాలా మంది ఎదుర్కొంటారు. అంత మాత్రాన గుండె జబ్బు అనుకోవద్దు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అలాగని ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం కూడా చేయొద్దు. ముందుగా వైద్యుడిని సంప్రదించి జబ్బు ఏమిటో నిర్ధారించుకోవాలి. గుండె సమస్య అయితే తగిన చికిత్స చేయించుకోవాలి.
ఎలాంటి వారికి గుండె జబ్బు వస్తుంది?
డయాబెటిస్‌, అధిక రక్తపోటు, హైకొలెస్ట్రాల్‌ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జబ్బులతో బాధపడుతున్న వారు అనారోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. ఇటీవల కాలంలో యువకుల్లో సైతం గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. స్మోకింగ్‌, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
వ్యాధి లక్షణాలు
కొద్ది దూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్టుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటం లాంటి లక్షణాలను గుండె జబ్బుగా అనుమానించాల్సిందే. అయితే... ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని అనుకోవద్దు. దీనిని నిర్ధారించుకోవడానికి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.
క్రమంగా చెకప్‌ చేయించుకోవాలి..
నలభై ఏండ్లు దాటిన వారు రెగ్యులర్‌గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా ముందస్తుగా జాగ్రత్త పడొచ్చు. ఈసీజీ, 2డీ ఎకో, కొలెస్టరాల్‌, టీఎంటీ పరీక్షల ద్వారా గుండె పనితీరు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బు అంటే...
పరీక్షల ద్వారా గుండె జబ్బు ఉందని తేలితే మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కువగా ఉందా.. ఎన్ని చోట్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ పరీక్ష అవసరమవుతుంది. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు లేక అంతకంటే ఎక్కువ బ్లాకులు ఉన్నా గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసీఏ)లో సమస్య ఉన్నట్లయితే బైపాస్‌ సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంటుల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్లు వేసినా, బైపాస్‌ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్య తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్‌ జరిగింది కదా.. మందులు ఆపేస్తుంటారు. ఇది సరికాదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ డైట్‌ కంట్రోల్‌ చేస్తుంండాలి. వ్యాయామం చేయడం మరువొద్దు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
ఆరోగ్యానికి నడక చాలా మంచిది. రోజూ అరగంటపాటు నడక తప్పనిసరి చేసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. అలాగే కొలెస్టరాల్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ గుండె పది కాలాలపాటు పదిలంగా ఉంటుంది.
అప్రమత్తత అవసరం
చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన వారస్తత్వ చరిత్ర ఉన్న వారు ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చర్యలు చేపట్టాలి. కొలెస్ట్రాల్‌ పెరగడమంటే ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా.. సన్నగా ఉన్నాడా అనేది ముఖ్యం కాదు. లావుగా ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ నార్మల్‌గానే ఉండొచ్చు. సన్నగా ఉన్న వారిలో చాలా ఎక్కువగానూ ఉండొచ్చు. అవన్నీ రక్త పరీక్షల్లో తేలవాల్సిందే తప్ప శరీరం బరువు ఆధారంగా మాత్రం కాదు.
అయితే... లావుగా ఉన్న వారిలో ఎక్కువ మందికి ఈ సమస్య ఉండొచ్చు. కుటుంబ చరిత్ర ఉన్న వారు చిన్న వయస్సు నుంచే కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. తీవ్రతను అనుసరించి ఆహార నియమాలు పాటించడం గానీ, కొన్ని మందులు వేసుకోవడం ద్వారా గానీ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచొచ్చు. అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒ క ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్న వారు వ్యాధిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. కనీసం ప్రతి మూడు నెలలకోసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడొచ్చు.
నిజానికి పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె పోటు తక్కువ. అయితే... మద్య వయసు వచ్చాక పురుషులతో సమానంగానే వీరూ గుండె పోట్లకు గురవుతున్నారు. సహజంగా మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ నిలిపోవడం అన్నది చాలా తక్కువ. కాకపోతే.. మెనోపాజ్‌ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికి తోడు గర్భాశయాన్నీ, అండాశయాన్ని కూడా తొలిగించే వారిలో పురుషులకు సమానం గానే గుండెపోటు వస్తుంది. అలా అని హార్మోన్‌ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా ఈ స్థితిని అరికట్టలేం. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం పెను ముప్పే. గుండె కండరానికి అవ సరమైన రక్తం అందదు. ఈ పేరుకుపోవడం అన్నది నిదానంగా జరిగితే ఆ లక్షణాలు కూడా అంతే నిదానంగా కనిపిస్తాయి. అలా కాకుండా ఏ కారణంగానైనా ఒక్కోసారి ఈ కొలెస్ట్రాల్‌ చిట్లిపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోతుంది. అప్పటి దాకా ఏ 70 శాతమో ఉన్న ఆటంకం క్షణాల్లో నూరు శాతంగా మారిపోతుంది. ఆ వెంటనే గుండె పోటు వచ్చేస్తుంది. గుండె వేగం విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత చాలా మందిలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ స్థితి ఏర్పడిన వారిలో సుమారు 50 శాతం మంది ప్రాణాలు కోల్పోవచ్చు. కొలెస్ట్రాల్‌ చితకడానికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా శారీరక, మానసిక ఒత్తిళ్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అందుకే.. కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించుకోవాలి. పొగతాగడం కానీ, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం గానీ పూర్తిగా మానుకోవడం ముఖ్యం.