ఎండకాలంలో ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి
ఎన్నో ఇబ్బందులుంటాయి. ఎంత కడిగినా... చర్మం చమటతో, ముడతలుపడినట్టు
కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సహజ గుణాలు కల్గిన
పదార్థాలను ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది...
- నిమ్మరసం: జిడ్డు చర్మం కలిగిన వారు నిమ్మరసంను ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకోవటానికి నిమ్మరసంలో ఐదు లేదా ఆరు చుక్కల నీటిని కలిపి ఓ కాటన్ ప్యాడ్తో ముఖానికి నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకున్న పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.జిడ్డు తొలగిపోవటంతో పాటు స్కిన్ ఫ్రెష్నర్గా పని చేస్తుంది.
- టమాట: ముఖంపై ఉన్న ముడతలను తొలగించటంలో టమాటలు ముఖ్యమైనవి. టమాటాలను సన్నగా కట్ చేసుకుని ముఖంపై రుద్దుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగితే చర్మంపై ఉన్న ముడతలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది.
- దోసకాయ: దోసకాయ రసం చర్మాన్ని రిఫ్రెష్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దోసకాయ రసాన్ని తాగినా.. ముఖానికి పట్టించినా..సరిపోతుంది. దోసకాయ రసాన్ని రోజూ తీసుకోవటం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోవటంతో పాటు తాజాదనంతో నిండి ఉంటుంది.
- గుడ్డు: గుడ్డులోని తెల్లసొన ముఖం ముడతలు పడకుండా కాపాడుతుంది. అలాగే చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారు గుడ్డులోని తెల్ల సొనను ముఖానికి పట్టించిన పది నిమిషాల తర్వాత కడిగితే చర్మంపై ఉన్న ముడతలు క్రమంగా తగ్గుతాయి.
- ఆపిల్ వెనిగర్: ఆపిల్ వెనిగర్ చర్మానికి సహజ సిద్ధమైన టోనర్. ముఖానికి దీన్ని పట్టించటం వల్ల చమట, జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
- బేకింగ్ సోడా: బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలుపుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించిన 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.









































