Monday, August 28

మీజిల్స్‌, రుబెల్లా నివారణ ఎలా?

తట్టు(మీజిల్స్‌)ను చిన్నమ్మవారు అని కూడా అంటారు. ఇది అంటు వ్యాధి. వైరస్‌ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని పర్యవసానంగా ఆరోగ్యపరంగా సంక్లిష్ట సమస్యలు ఎదురవు తుంటాయి. న్యూమోనియా, ఎన్‌సెఫలిటీస్‌( మెదడు వాపు) వంటివి సంక్రమిస్తాయి. దీంతో ఒక్కోసారి మరణం సంభవించొచ్చు.
పొంగు (రుబెల్లా) అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. పిల్లలు వాక్సిన్‌ తీసుకోని కారణంగా ఇది సంక్రమిస్తుంది. యువత, వృద్ధుల్లోనూ పొంగు వచ్చే అవకాశాలున్నాయి. వాక్సిన్‌ తీసుకోని మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఇదొస్తే తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల వరకు పొంగు వస్తే గర్భస్త్రావం అవుతుంది. గర్భంలోనే శిశువు చనిపోవచ్చు. శిశువుకు పుట్టుకతోనే పొంగు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఏమిటీ వ్యత్యాసం?
తట్టు, పొంగుకు సంబంధించిన వైరస్‌లు వివిధ వైరస్‌ కుటుం బాలకు చెందినవి. కానీ ఈ రెండు రకాల పోలికలూ మాత్రం దగ్గరగా ఉంటాయి.

  1. మనుషులకు మాత్రమే ఈ వ్యాధులు సంక్రమిస్తాయి.
  2. ఒకరి నుంచి మరొకరికి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తాయి.
  3. ఇన్‌ఫెక్షన్‌ తర్వాత జ్వరం వస్తుంది. చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి.
పుట్టుకతో 'పొంగు' అంటే?
పుట్టుకతో పొంగు వ్యాధి రావడానికి ప్రధాన కారణం 90 శాతం వరకు తల్లి అవుతుంది. గర్భం దాల్చిన మహిళకు మొదటి పది వారాలలోపు పొంగు వస్తే బిడ్డకు పుట్టుకతో ఆ వ్యాధి సంక్రమిస్తుంది. తల్లికి పొంగు వ్యాధి రావడం వల్ల గర్భస్త్రావం అవుతుంది. లేదా శిశువుకు పుట్టుకతో లోపాలు తలెత్తొచ్చు. గుండె సంబంధిత వ్యాధులతోపాటు చెవిటి మూగ, మెదడు దెబ్బతినడం, కంటి సమస్యలు రావచ్చు. కాటరాక్ట్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వ్యాప్తి ఇలా...
తట్టు సర్వసాధారణంగా శ్వాస ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మీజిల్స్‌ వైరస్‌ వల్ల తట్టు వస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా గాలి ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ సంక్రమిస్తుంది. నాలుగురోజుల్లోనే చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి. పొంగు మాత్రం ముక్కు, నోరు నుంచి కారుతున్న స్రావాల ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. వాక్సిన్‌ వేసుకోని వారికి పొంగు దాడి చేసే ప్రమాదం ఉంది.
ముప్పు ఎవరికి?
ఎవరికైనా ఈ వైరస్‌ ముప్పు పొంచి ఉంటుంది. వాక్సిన్‌ తీసుకోని వారితో పాటు గతంలో పొంగు ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి పొంగు వచ్చే ప్రమాదముంది. తొమ్మిది నెలలలోగా తట్టు నివారణకు రెండు డోసులు వాక్సిన్‌ వేసుకోని వారికి మీసల్స్‌ వైరస్‌ సంక్రమిస్తుంది. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి తట్టు, పొంగు వ్యాధులు వ్యాపిస్తుంటాయి. క్యాన్సర్‌ రోగులు తీసుకునే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ డోస్‌ ఉన్న ఉత్ప్రేరక మందులు వాడటం వల్ల ఈ రెండు రకాల వ్యాధులు వస్తాయి.
నివారణ ఎలా?

  1. తట్టు, పొంగు నివారణకు రెండు డోసుల ఎంఎంఆర్‌(మీజిల్స్‌, మమ్ప్స్‌, రుబెల్లా) వాక్సిన్‌ తీసుకోవాలి. ఇది ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడుతుంది.
  2. ఈ వాక్సిన్‌ పిల్లలకు తొమ్మిది నెలలలోపే ఇవ్వాలి.
  3. రెండో డోసు ఎంఎంఆర్‌వీ(మీజిల్స్‌, మమ్ప్స్‌, రుబెల్లా, వెరిసెల్లా) వాక్సిన్‌ 15 నెలల వయసులో ఉన్న శిశువుకు ఇవ్వాలి. మూడో డోసు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇవ్వాలి.
  4. రెండు పర్యాయాలకన్నా ఎక్కువగానే ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం సురక్షితం.
  5. తట్టు వైరస్‌ సంక్రమించినవారు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సంక్రమించదు. కనీసం నాలుగురోజుల పాటు దద్దుర్లు ఉంటాయి. తట్టు లేనివారికి దూరంగా ఉండాలి.
  6. పొంగు వ్యాధి సంమ్రించిన గర్భిణికి వాక్సిన్‌ ఇవ్వకపోవడమే ఉత్తమం
నిర్ధారణ ఇలా...
పొంగు వ్యాధిని నిర్ధారించడం చాలా కష్టం. ఇతర వైరస్‌ల వల్ల అనారోగ్యం వాటిల్లినట్టుగానే ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. జ్వరం, దద్దుర్లు వస్తుంటాయి. రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారణ చేసుకోవాలి.
తట్టును త్వరగా గుర్తించొచ్చు. దీని బారినపడిన వ్యక్తులకు అసౌ కర్యంగా ఉంటుంది. తరచూ దగ్గుతుంటారు. ముక్కు నుంచి స్రావాలు కారడం, జ్వరం, దద్దుర్లు వాటిల్లి తట్టు లక్షణాలుగా అనుమానించొచ్చు. తట్టు వ్యాధి లక్షణాలు కనిపించగానే రక్త పరీక్ష చేయించాలి. వ్యాధిని సులభంగా గుర్తించడానికి ముక్కు, గొంతు, మూత్రం నుంచి శాంపిల్స్‌ సేకరిస్తారు.
చికిత్స
తట్టు, పొంగు వ్యాధులను అరికట్టడానికి విశ్రాంతి చాలా అవసరం. పారాసెటమల్‌ మాత్రలు వేసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది. ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. తట్టు, పొంగు వ్యాధి వచ్చినవారికి ఇంట్లోనే ఉండే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే ఒకరి నుంచి మరొకరికి ఇవి వ్యాపిస్తాయి. వీటి లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవాలి.

No comments:

Post a Comment