Thursday, June 29

వర్షాకాలం.. జాగ్రత్తలు

    వాన నీటితో నేలంతా బురదగా మారుతుంది. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అంటురోగాలు ప్రబలడం ఖాయం. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్త విరేచనాలు, కలరా, అమిబియాసిస్‌, టైఫాయిడ్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, పోలియో, నులిపురుగుల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై మలేరియా, మెదడువాపు, డెంగ్యూ జ్వరం, చికున్‌గున్యా, బోధవ్యాధి రావచ్చు. 


వీటిని నివారించేందుకు జాగ్రత్తలు అవసరం :-
  1. బాగా కాచి చల్లార్చిన నీరు తాగండి. 15 నిమిషాలపాటు నీళ్లను కాచండి. కాచిన పాత్రలోనే చల్లార్చండి. అవసరమనుకుంటే కాచే ముందు వడగట్టండి. ఈచర్యతో నీటి కాలుష్యపు వ్యాధులు నిరోధించొచ్చు.
  2. దోమ తెరలు వాడండి. తద్వారా దోమలు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందండి.
  3. తాగునీటి వనరుల్లో ఆరోగ్య కార్యకర్త సహాయంతో బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపించండి.
  4. చెరువులు, గుంటలు, కాల్వల నీటిని అస్సలు తాగొద్దు.
  5. మీ ప్రాంతంలో నీటి కాలుష్యపు వ్యాధులొస్తే దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తకు తెలపండి. నివారణ చర్యలు చేపట్టేలా చూడండి.
  6. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించండి.
  7. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దు.
  8. వ్యర్థ పదార్థాలను పరిశుభ్రంగా, సురక్షితంగా పారేయండి.
  9. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడగండి.
  10. శుభ్రత పాటించని హోటళ్లలో ఆహారం తినకండి. కాచి చల్లార్చిన నీరు ఇవ్వమని అడగండి.
  11. వీధుల్లో విక్రయించే పళ్ల రసాలు తాగొద్దు.
  12. కాచి చల్లార్చిన, క్లోరినేషన్‌ చేసిన నీటితో తయారు చేసిన ఐస్‌ ముక్కలనే వాడండి.
  13. బాగా ఉడికించిన ఆహారమే తినండి.
  14. చలిగాలులకు వీలున్నంత వరకు దూరంగా ఉండండి.
  15. వానాకాలం పాదాలను పొడిగా ఉంచుకోవడం చాలా అవసరం.

No comments:

Post a Comment