వాన నీటితో నేలంతా బురదగా మారుతుంది. పరిసరాలు
అపరిశుభ్రంగా తయారవుతాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది.
తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అంటురోగాలు ప్రబలడం ఖాయం. వర్షాకాలంలో నీటి
కాలుష్యం వల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్త విరేచనాలు, కలరా,
అమిబియాసిస్, టైఫాయిడ్, కొన్ని రకాల పచ్చకామెర్లు, పోలియో, నులిపురుగుల
వ్యాధులు ఎక్కువగా వస్తాయి. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై మలేరియా,
మెదడువాపు, డెంగ్యూ జ్వరం, చికున్గున్యా, బోధవ్యాధి రావచ్చు.
వీటిని
నివారించేందుకు జాగ్రత్తలు అవసరం :-
- బాగా కాచి చల్లార్చిన నీరు తాగండి. 15 నిమిషాలపాటు నీళ్లను కాచండి. కాచిన పాత్రలోనే చల్లార్చండి. అవసరమనుకుంటే కాచే ముందు వడగట్టండి. ఈచర్యతో నీటి కాలుష్యపు వ్యాధులు నిరోధించొచ్చు.
- దోమ తెరలు వాడండి. తద్వారా దోమలు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందండి.
- తాగునీటి వనరుల్లో ఆరోగ్య కార్యకర్త సహాయంతో బ్లీచింగ్ పౌడర్ కలిపించండి.
- చెరువులు, గుంటలు, కాల్వల నీటిని అస్సలు తాగొద్దు.
- మీ ప్రాంతంలో నీటి కాలుష్యపు వ్యాధులొస్తే దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తకు తెలపండి. నివారణ చర్యలు చేపట్టేలా చూడండి.
- వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించండి.
- బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దు.
- వ్యర్థ పదార్థాలను పరిశుభ్రంగా, సురక్షితంగా పారేయండి.
- ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడగండి.
- శుభ్రత పాటించని హోటళ్లలో ఆహారం తినకండి. కాచి చల్లార్చిన నీరు ఇవ్వమని అడగండి.
- వీధుల్లో విక్రయించే పళ్ల రసాలు తాగొద్దు.
- కాచి చల్లార్చిన, క్లోరినేషన్ చేసిన నీటితో తయారు చేసిన ఐస్ ముక్కలనే వాడండి.
- బాగా ఉడికించిన ఆహారమే తినండి.
- చలిగాలులకు వీలున్నంత వరకు దూరంగా ఉండండి.
- వానాకాలం పాదాలను పొడిగా ఉంచుకోవడం చాలా అవసరం.
No comments:
Post a Comment